మనదేశం పెట్రోల్, బంగారం లాగానే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నది – పామాయిల్. దేశంలో అవసరాలకు తగిన స్థాయిలో ఆయిల్ పామ్ సాగు లేకపోవటమే ఇందుకు కారణం. అంతర్జాతీయ పరిణామాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా దాని ప్రభావం పామాయిల్ ధరపై పడుతోంది. పామాయిల్ మనకు ఎగుమతి చేసే దేశాలతో సంబంధాలు చెడిపోయినా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మలేషియాతో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ ప్రజలకు పెనుభారంగా మారుతోంది. రష్యా – ఉ క్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, కరోనా సమయంలో నూనెల ధరలు పెరగటంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ సాగు చేయాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రాయితీలతో ప్రోత్సహిస్తోంది. స్వయంగా మంత్రులు, ఎమ్మేల్యేలు ఆయిల్ పామ్ సాగు చేస్తుండటం విశేషం. రాయితీలు, ఆర్థిక సాయం, బ్యాంకు రుణాలు కూడా అందటం రైతులను కూడా ఆకర్షిస్తోంది. సంప్రదాయ పంటలు సాగుచేస్తూ ఏటా నష్టాలే మూటగట్టుకుంటున్న రైతులకు ఈ పంట చక్కని ప్రత్యామ్నాయం అవుతుంది. కొన్నేళ్ల పాటు అంతర సాగు కింద ఇతర పంటలు కూడా సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందొచ్చు.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతుకు
ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం
- మొదటి ఏడాది ఎకరాకు రూ. 26,000
- రెండో ఏడాది ఎకరాకు రూ. 5,000
- మూడో ఏడాది ఎకరాకు రూ. 5,000
పంట సాగు, రాయితీలు ఇలా..
- ఎకరా పొలంలో 9 X 9 చొప్పున 50 వరకు మొక్కలు అవసరం..
- ఒక్కో మొక్క ధర రూ. 117 వరకు ఉంటోంది.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 33లకే ఒక మొక్క అందిస్తోంది.
- సూక్ష్మసేద్యం (డ్రిప్) పైపుల ఏర్పాటుకు 90 % రాయితీ ఇస్తోంది.
- ఎస్సీ రైతులు అయితే 100 % రాయితీ అందుతుంది.
పంట దిగుబడి, ఆదాయం ఇలా..
- ఒక్కసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు స్థిరంగా ఆదాయం వస్తుంది.
- పంట సాగు చేశాక మూడేళ్లకు దిగుబడి రావటం ప్రారంభమవుతుంది.
- నెలకు రెండు కోతల చొప్పున ఏటా 12 టన్నుల దిగుబడి వస్తుంది.
- టన్ను ఆయిల్ పామ్ ధర రూ. 20వేల నుంచి రూ.22వేలు ఉంటోంది..
- ఎకరాపై ఏటా రూ. 2,64,000లకు పైగా ఆదాయం వస్తుంది.