ఆర్టీసీ సంస్థ టికెట్లో రాయితీ ఇస్తూ దివ్యాంగులైన ప్రయాణికులకు చేయూత అందిస్తోంది. అవగాహన లేక దివ్యాంగుల పాస్ను చాలా మంది తీసుకోవటం లేదు. శారీరక దివ్యాంగులు, బుద్ధిమాంద్యం, అంధులు, మూగ, చెవిటి, అవిటి వారికి ఈ ప్రత్యేకమైన పాస్లు ఇస్తారు. ఇందుకోసం బస్ పాస్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో సదరం (Access Rehabilitation and Empowerment – SADAREM) సర్టిఫికెట్, విద్యార్థులయితే ఐడీ కార్డు, ఆధార్ కార్డు నకళ్లు జత చేయాలి. దివ్యాంగులకు సహాయకులు తప్పనిసరిగా అవసరమైతే వారికి కూడా ఎస్కార్ట్ బస్ పాస్ అందిస్తారు. ఒకసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు పనిచేస్తుంది. ఈ సేవలను తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, సేవాభిలాషులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని దివ్యాంగులకు పాసులు ఇప్పించొచ్చు. ఆర్టీసీ అధికారులకు విన్నవిస్తే గ్రామాల్లో ప్రత్యేకంగా శిబిరం కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడికక్కడే పాస్లు జారీ చేస్తారు.
బస్సు టికెట్లో రాయితీలు ఇలా..
- జిల్లాలో, రాష్ట్రంలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్సో 50 శాతం రాయితీ..
- నగరాల్లోని సిటీ బస్సుల్లో 100 శాతం రాయితీ. ఇది నగరవాసులకే వర్తిస్తుంది.
- అంధులు, బుద్ధిమాంద్యం, దివ్యాంగులకు సహాయకులు అవసరమైన పక్షంలో వారికి 50 శాతం రాయితీ ఇస్తారు.
దివ్యాంగుల పాసుకు అర్హులు వీరే
నం. | కేటగిరీ | అర్హమైన వైకల్యం శాతం | సహాయకులకు అవకాశం |
1. | అంధులు | 100 % | ఉంది |
2. | మూగ, చెవిటి | 100 % | లేదు |
3. | శారీరక వైకల్యం | 40 % < | లేదు |
4. | బుద్ధి మాంద్యం | > 69 % | ఉంది |
5. | కుష్టు నయమైన వారు | 40 % < | లేదు |